నెల్లూరు జిల్లా ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డి.. నేడో, రేపో బాధ్యతల స్వీకరణ

by Dishanational2 |
నెల్లూరు జిల్లా ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డి.. నేడో, రేపో బాధ్యతల స్వీకరణ
X

దిశ, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజలకు భద్రత కరువైందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. హత్యలు దొంగతనాలు, దోపిడీలతో ఈ మధ్యకాలంలో క్రైమ్ రేటు పెరిగిందనే చెప్పాలి. ఇటీవల కాలంలో పట్టపగలే దారుణ హత్యలు. ఎక్కడ చూసినా ఆర్థిక మోసాలు. గంజాయి సరఫరా, వినియోగం. భూ కబ్జాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణాలతో నెల్లూరు జిల్లా నేరాలకు కేంద్రంగా మారిందా? అన్న అనుమాన రాక మానదు. వసతులు, అధికార యంత్రాంగం కేందీకృతమైన నగరం, పట్టణాల్లో సైతం శాంతిభద్రతల పరిరక్షణ కష్టతరంగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న నేరప్రవృత్తి, పోలీసుల నిర్లక్ష్యం, ఏళ్ల తరబడి పాత కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

కొత్త ఎస్పీపైనే ఆశలు

జిల్లా నూతన ఎస్పీగా కె.తిరుమలేశ్వర రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాకు విజిలెన్స్ ఎస్పీగా విధులు నిర్వహించిన తిరుమలేశ్వర్‌రెడ్డి నేడో, రేపో ఎస్పీగా నెల్లూరు జిల్లాలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రజలు ఆయనపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. క్రైమ్ క్యాపిటల్‌గా మారిన నెల్లూరును చక్కదిద్దగలరని ఆశిస్తున్నారు. గత ఎస్పీ విజయరావు క్రైమ్ రేటును అరికట్టేపనిలో ఆయన అనేక రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పడు కొత్త ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డి రాజకీయ నాయకుల ఒత్తిళ్లను అధిగమించి ఏవిధంగా నెల్లూరులో క్రైమ్‌ రేటును తగ్గించగలరన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తిరుమలేశ్వర్ రెడ్డి త్వరలోనే నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

జిల్లాలో నేరాలపై రాజకీయ విమర్శలు

రాష్ట్రానికి మూడు రాజధానులు తెస్తానని జగన్‌ రెడ్డి అంటున్నారు. వాస్తవానికి ఆయన తయారు చేసిన 4వ రాజధానిని మర్చిపోయారు. నెల్లూరుని క్రైం క్యాపిటల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని టీడీపీ నేత నారా లోకేశ్ గతంలో విమర్శలు చేశారు. మర్డర్లు, మానభంగాలు, భూ కబ్జాలు, పోలీసుల హింసకి నెల్లూరు రాజధానిగా మారిందని చెప్పుకొచ్చారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే వైసీపీ నేతల వేధింపులు తాళలేక ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవడంపై లోకేశ్ మండిపడ్డారు. ఇటీవల కాలంలో జిల్లాలో వరస నేరాలు నమోదు కావడంతో జనసేన, వామపక్ష నేతలు కూడా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెల్లూరును క్రైమ్ క్యాపిటల్‌గా మారిందని విమర్శలు చేశారు.

సంచలనం సృష్టించిన జంట హత్యల ఘటనలు

నెల్లూరులో ఇటీవల జరిగిన హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఓ ఇంట్లో దంపతులను దారుణంగా హత్య చేశారు. వారి వద్ద ఉన్న బంగారు అభరణాలను దొంగిలించారు. 25 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లా నుంచి వచ్చి నెల్లూరులోని అశోక్‌నగర్‌లో ఉంటున్న వసురెడ్డి కృష్ణారెడ్డి, సునీత అనే దంపతులు స్థానికంగా శ్రీరామ్‌ క్యాంటీన్‌ నడుపుతున్నారు. రాత్రి దుండగులు వారి ఇంటిలోకి చొరబడి దంపతుల గొంతును కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సంచలనంగా మారింది. ఇదీ మరవక ముందే రెండు రోజుల తరువాత నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్ టైలర్స్ కాలనీలో ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి చాలా దారుణంగా చంపేశారు. రమణారెడ్డి, శ్రీకాంత్ అనే వ్యక్తులు మద్యం సేవిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆటోలో వచ్చి కిరాతకంగా కత్తితో పొడిచాడు. దీంతో ఘటనా స్థలంలోనే వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇలాంటి ఘటనలు నెల్లూరు జిల్లాలో చాలానే చోటుచేసుకున్నాయి. నూతన ఎస్పీగా నియమితులవుతున్న తిరుమలేశ్వర్ రెడ్డి ఇలాంటివి పునరావృతం కాకుండా ఆరికట్టాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి.

Also Read..

కుమార్తెతో కలిసి తల్లిదండ్రుల ఆత్మహత్యాయత్నం

Next Story

Most Viewed